కేసీఆర్​వ్యాఖ్యలు... ఉత్తరాంధ్ర నాయకుల్లో కలవరం

by Dishanational1 |
కేసీఆర్​వ్యాఖ్యలు... ఉత్తరాంధ్ర నాయకుల్లో కలవరం
X

"పోలవరం నిర్మాణాన్ని కాళేశ్వరంలా వేగంగా పూర్తి చేస్తాం. విశాఖ స్టీల్​ప్లాంటును బీజేపీ అమ్మేస్తే.. మేం అధికారానికి రాగానే జాతీయం చేస్తాం. వాళ్లది ప్రైవేటైజేషన్.. మాది నేషనలైజేషన్​పాలసీ" అంటూ బీఆర్ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలోని ప్రధాన రాజకీయ పక్షాల నాయకులను కలవరపెడుతున్నాయి. ఏపీకి రథసారథ్య బాధ్యతలను మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్​కు అప్పగించిన సందర్భంగా సోమవారం కేసీఆర్​చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్​లేవనెత్తిన అంశాలపై రాష్ట్రంలోని ప్రధాన పక్షాల అధినేతల నుంచి ఎలాంటి స్పందన లేదు.

దిశ, ఏపీ బ్యూరో: సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్​కార్యకలాపాలు విస్తృతం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. దేశ రాజకీయాల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బీఆర్ఎస్​తోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్​లో చేరింది కొందరే... చాలా మంది సిట్టింగ్​ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరతామని ఎప్పటి నుంచో తనతో టచ్​లో ఉన్నట్లు వెల్లడించారు. కేసీఆర్​వ్యాఖ్యలపై సీఎం జగన్, చంద్రబాబు, పవన్​కల్యాణ్​నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయా పార్టీల నుంచి కొందరు నేతలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి పేర్ని నాని... రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్​పార్టీకి ఆంధ్రా ప్రజల నుంచి మద్దతు లభించదని చెప్పుకొచ్చారు.

తెలంగాణ పార్టీలు మాకొద్దు...

ఇక బీజేపీ నాయకులైతే తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణ పార్టీలు మాకొద్దంటూ ఎంపీ జీవీఎల్ విరుచుకుపడ్డారు. బీజేపీ – జనసేన కూటమిని దెబ్బతీయడానికే కేసీఆర్​బీఆర్ఎస్​ను ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆరోపించారు. ఇక్కడ కాపుల్లో చిచ్చుపెట్టి కుల రాజకీయాలకు తెర లేపుతున్నారంటూ విమర్శించారు. ఏపీ అధ్యక్షుడిగా వచ్చిన తోట చంద్రశేఖర్​నిన్నమొన్నటిదాకా జనసేన పార్టీలో కొనసాగారు. ఆయన నిర్ణయంపై జనసేన నేతలు స్పందించలేదు. బీఆర్ఎస్ గురించి కూడా ఎవరూ మాట్లాడడం లేదు. టీడీపీ విజయావకాశాలను దెబ్బతీయడానికే కేసీఆర్ బీఆర్ఎస్​ను రాష్ట్రానికి తెచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.


అగ్రనేతల వ్యూహాత్మక మౌనం...

రాష్ర్టంలోని ప్రధాన పార్టీల నేతలు నోరు తెరిస్తే విశాఖ స్టీల్​అమ్మకంపై బీజేపీని విమర్శించాలి. రైల్వే జోన్​ఇవ్వనందుకు కమలనాథులను బోనులో నిలబెట్టాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన పార్టీ అంటూ బీజేపీ నేతలపై విమర్శలు చేయాలి. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కొర్రీలు వేస్తూ ఇప్పట్లో పూర్తి చేయలేమని చేతులెత్తేసినందుకు దునుమాడాలి. కాకినాడ పెట్రో కారిడార్​ఇవ్వనందుకు నిలదీయాల్సి వస్తుంది. వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్​ఖండ్​తరహా ప్యాకేజీ ఇస్తామని మొండి చెయ్యి చూపినందుకు కేంద్రాన్ని దుయ్యబట్టాలి. అందుకే మూడు పార్టీల నేతలు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఏపీ ప్రజల మద్దతును కేసీఆర్ పొందగలరా?

అదే సందర్భంలో బీఆర్ఎస్​కూ కొన్ని ఇబ్బందులున్నాయి. విద్యుత్​బకాయిలు రూ. 6 వేల కోట్లకు పైగా ఏపీకి తెలంగాణ చెల్లించాలి. పోలవరంపై అభ్యంతరాలను విశ్లేషించి రెండు రాష్ట్రాల ఆమోదాన్ని పొందాలి. ఇంకా విభజనకు నోచుకోని ఉమ్మడి ఆస్తులపై రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేట్లు పంపకాలు కావాలి. రాష్ట్ర విభజనకు కేసీఆరే కారణమనే అపవాదును తొలగించుకోవాలి. ఆనాటి వాస్తవ పరిస్థితులను వివరించి ప్రజల మద్దతు పొందాల్సి ఉంది. పార్టీ పగ్గాలను ఓ రిటైర్డ్​ఐఏఎస్​అధికారికి అప్పగించారు. సహజంగా బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వాళ్లు నాయకత్వ బాధ్యతల్లో రాణించిన దాఖలాలు అంతగా లేవు. కింది స్థాయి కార్యకర్తదాకా కలిసిపోయే తత్వం తక్కువగా ఉంటుంది. ఈ లోపాలను అధిగమించి ప్రజల మెప్పు పొందడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read...

ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్​ ఆఫర్లు? సీన్‌లోకి కేసీఆర్!



Next Story

Most Viewed